ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పరీక్షలకు విద్యార్ధులు రడీ అవుతుండగా వారి తల్లి దండ్రులు మాత్రం తమ పిల్లలు, తాము కరోనా బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు.
పదో తరగతి పరీక్షలను పలు రాష్ట్రాలు రద్దు చేసి ఉన్నత తరగతులకు విద్యార్ధులను ప్రమోట్ చేశాయి. అయితే అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం ఉండకపోవచ్చునని కూడా కొందరి విశ్లేషణ.
తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ఉన్నత తరగతులకు పంపించాయి. అదే విధంగా ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు కరోనా తీవ్రత పెరగక ముందే పదో తరగతి పరీక్షలు నిర్వహించేశాయి.
ఇప్పుడు కరోనా తీవ్రత ఎంతో ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎవరికి కరోనా సోకుతుందో అనే భయం అందరిని పట్టి పీడిస్తున్నది. ఈ దశలో పదో తరగతి పరీక్షలు నిర్వహించడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. భయం భయంగా విద్యార్ధులను తీసుకుని తల్లిదండ్రులు పదో తరగతి పరీక్షలకు వెళ్లాల్సి వస్తుందని, ఈ సమయంలో ఇంత హడావుడి అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై పిటిషన్ దాఖలైనప్పుడు ‘‘ఎన్ని చర్యలు తీసుకున్నా విద్యార్ధులకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు’’ అని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయాన్ని కూడా మరి కొందరు గుర్తు చేస్తున్నారు.