కాపు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. అర్హులైన కాపు మహిళలకు ఏటా 15వేల రూపాయల చొప్పున అయిదేళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయనుంది.
తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మంది అర్హులైన మహిళలకు సుమారు 354 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. నేరుగా వారి ఖాతాల్లోనే 15 వేల రూపాయల చొప్పున జమ చేస్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45- 60 వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించనివారు కూడా ఈ పథకానికి అర్హులుగా ఉంటారు.
కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి/10 ఎకరాల మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి/ 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు/ ఇతర ఏ నిర్మాణాలు లేనివారు అర్హులు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేకుండా, ప్రభుత్వ పింఛను పొందనివారు, కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండనివారు(ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు),
కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారు లేనివారు కూడా అర్హులు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 76,361 మంది లబ్ధిదారులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 3726 మంది మాత్రమే ఉన్నారు.