‘‘పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు’’ అంటూ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి పెట్టిన ట్విట్ ను మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు. ఒక దొంగ తనపై ఆరోపణలు చేయడం కొత్తగా ఉందని ఆయన అన్నారు.
మంత్రి అయిన మరునాడు కాణీపాకం వెళ్లి ప్రమాణం చేసి నిజాయితీగా పదవిని నిర్వహించిన వ్యక్తిని తాను అని శ్రీనివాస్ అన్నారు. ఆయన లాగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు తాము రాజకీయాలలోకి రాలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను సాగనంపేందుకు అడ్డదారిన తీసుకువచ్చిన ఆర్డినెన్సుపై తాను హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లానని అందులో రహస్యం ఏమీ లేదని ఆయన అన్నారు. తానూ, రామేష్ కుమార్ కలిస్తే అది తప్పెలా అవుతుదని, దొంగతనం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
తమ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సుజనా చౌదరిని తాము కలిస్తే అందులో విచిత్రం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా కోర్టులకు గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించేవారే దొంగలు తప్ప తాము కాదని ఆయన అన్నారు.