ఆర్టీసీ కార్మికుడు బాబు అంత్యక్రియల్లో పాల్గొన్న తనపై చెయ్యి చేసుకున్న పోలీసు అధికారిపై కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ నేడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ మోషన్ నోటీసును అందచేశారు. పార్లమెంటు సభ్యుడిపై ఈ విధంగా అనుచితంగా ప్రవర్తించడం సభ్యుడి హక్కుల కిందికి వస్తుంది. ఇదే విషయాన్ని నోటీసు రూపంలో బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు వివరించారు. బండి సంజయ్ నోటీసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి తనకు నివేదిక ఇవ్వాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా ప్రివిలేజస్ కమిటీ చైర్మన్ సుశీల్ కుమార్ సింగ్ ను కోరారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని లోక్ సభ స్పీకర్ కోరారు. పార్లమెంటు సభ్యుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోక్ సభ స్పీకర్ హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తామని ఆయన తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిపై పోలీసు అధికారి జరిపిన దాడిపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా కేసు నమోదు చేసింది. లోక్ సభ స్పీకర్ ను కలిసిన వారిలో బండి సంజయ్ తో బాటు బిజెపి పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.