నమ్మి గెలిపించిన కరీంనగర్ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసేది లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ 43వ డివిజన్లో 20 లక్షల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్ నిర్మాణ పనులకు నేడు ఆయన శంకుస్థాపన చేశారు. కరీంనగర్ కేవలం నియోజకవర్గమే కాదు… ఉమ్మడి జిల్లాకు జిల్లా కేంద్రం అని అందువల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి తెలిపారు. అందులో భాగంగా స్మార్ట్ సిటీ నిధులతో కరీంనగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు.
పెద్ద ఎత్తున నిధులను తీసుకువచ్చి నగరంలోని ప్రధాన… అంతర్గత రహదారులను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వేసిన రోడ్లను నీట్ గా ఉంచేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి ఆధునిక మిషనరీని కొనుగోలు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్యమే మా బాధ్యత అని, ఇంకా నిధులు తీసుకువచ్చి కరీంనగర్ అన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం అని మంత్రి స్పష్టం చేశారు.