నేరాలను నియంత్రించేందుకు , పరిశోధనలోనూ సాంకేతిక పరిజ్ఙానం ఆయుధంగా పోలీసులు ఉపయోగించుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు అన్నారు. వనపర్తిలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు,అన్ని పోలీస్టేషన్ల ఎస్సైలతో జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు నెలవారి నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కేసులు విచారణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా కొత్త కొత్త మోసాలకు పాల్పడుతూ అమాయకపు ప్రజల నగదును సునాయాసంగా దోచుకుంటున్నారు. జిల్లా ప్రజలందరికీ సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎవరైనా సైబర్ నేరం బారినపడి నగదును కోల్పోయిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు వెంటనే ఫోన్ చేసి సమాచారం అందించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అక్రమంగా గుట్కా, గంజాయి రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులను ఖచ్చితంగా పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు వారికి తగు సూచనలు చేయాలని కోరారు. నేరాల నియంత్రణలో చేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతీ ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
5S విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని,ఫైళ్లను క్రమ పద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. ఈనెల సమీక్షా సమావేశంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ, షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పీ ,ఆనంద్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాసచారి, వనపర్తి సిఐ, ప్రవీణ్ కుమార్, ఆత్మకూరు సిఐ, రత్నం, వనపర్తి జిల్లాలోని ఎస్సైలు, డీసీఆర్బీ, సిబ్బంది, ఐటీ సెల్, సిబ్బంది ఉన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్