2022-23 సం.నికి వానాకాలం (ఖరీఫ్) వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే రైతులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఆదేశించారు. గురువారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2022-23 సం.నికి వానాకాలం (ఖరీఫ్), ” కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు” గోడపత్రిక, కరపత్రాలను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాలం ఖరీఫ్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని, వరి ధాన్యం “ఏ” గ్రేడ్ ధర రూ.2060/- గా, సాధారణ రకం ధర రూ.2040/- గా నిర్ధారించడం జరిగిందని ఆమె సూచించారు.
వరి పంటకు మద్దతు ధర పొందాలంటే రైతులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె తెలిపారు. ధాన్యాన్ని ఆరబెట్టి, చెత్త- తాలు, మట్టి , రాళ్లు లేకుండా శుభ్రపరచాలని ఆమె సూచించారు. తేమ-17.0 శాతం, తాలు – చెత్త -1.0 శాతం, మట్టి – రాళ్ళు – 1.0 శాతం, చెడి పోయిన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు తిన్న దాన్యం -5.0 శాతం, పూర్తిగా తయారుకానీ, ముడుచుకుపోయిన దాన్యం -3.0 శాతం, తక్కువ రకముల మిశ్రమం -6.0 శాతం, చెడిపోయిన, మొలకెత్తిన, పురుగు తిన్న దాన్యం – 4.0 శాతానికి మించకూడదని ఆమె వివరించారు.
కొనుగోలు కేంద్రాలకు రవాణా సక్రమంగా జరిగేలా చూడాలని, కొనుగోలు, చెల్లింపులలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా (ఓ.పి.ఎం.ఎస్) విధానాన్ని అమలు చేయటం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె తెలిపారు. కనీస మద్దతు ధరకు రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆన్లైన్ ద్వారా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సరిచేసుకోవాలని, టోల్ ఫ్రీ నెం.1967/ 1800 425 00 333 కి సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
రైతుల ఫోన్ నెంబర్ కు ఆధార్ తో అనుసంధానం చేసుకున్న తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని ఆమె సూచించారు. ఆధార్ బ్యాంకుల ద్వారా, ఆధార్ కేంద్రాలు, పోస్ట్ ఆఫీస్ లు, మీసేవ కేంద్రాలలో అనుసంధానం చేసుకోవాలని ఆమె తెలిపారు. ధాన్యం విక్రయించే సమయంలో ఓటిపి కోసం ఫోన్ నెంబర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆమె సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఆధార్ కార్డు, జిల్లా కలెక్టర్ చే నియమించబడిన అధికారి ధ్రువీకరణ పత్రం, పట్టాదార్ పాస్ పుస్తకం, అందుబాటులో ఉండేలా చూడాలని, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ జత చేయాలని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు గోపాల్ జిల్లా పౌరసరఫరాల అధికారి కొండల్ రావు, మార్కెటింగ్ అధికారి స్వొరన్ సింగ్, డి. సి.వో. కాళీ క్రాంతి, డి. అర్.డి.ఓ.నర్సింలు జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్