ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశం చేశారని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అల్లాడుతుంటే ధాన్యం కొనాలంటే టోకెన్లు తీసుకుని అమ్మే దుస్థితి తీసుకువచ్చారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో మామిడి బీరయ్య అనే రైతు 10 రోజుల క్రితం తను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని చూసి చలించి అక్కడే ప్రాణాలు కోల్పోవడమంటే ఇది ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత, కేసీఆర్ చేతకాని తనానికి నిలువెత్తు సాక్ష్యమన్నారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం కాదని రైతులను అన్నిరకాలుగా ఆదుకోవాలన్నారు.
ఇప్పటికే చాలా కేంద్రాల్లో వడ్లు కొనుగోలు మొదలు కాలేదని వర్షం వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో కూడ రైతు ఇంతగా పీడనకు గురికాలేదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమకారుల రైతులు,నిరుద్యోగుల,సబ్బండ వర్గాల ఊసురు తగలడం మొదలైందని అది హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలనుండే ప్రారంభమైందన్నారు. స్వరాష్ట్రం ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు చేసిన అసలైన ఉద్యకారులు కాదని ఉద్యమ ద్రోహులను, కుల బంధువులను అందలం ఎక్కించి రాక్షాసానందరం పొందుతున్నారని అన్నారు.
ఉద్యమ నిర్మాణానికి,తెలంగాణ భవన్ నిర్మాణానికి రాళ్లెత్తిన తెలంగాణ వాదులను ఒక్కొక్కరిగా బయటకు పంపి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఆయన అన్నారు. అసలైన ఉద్యమకారులకు ద్రోహం చేసినందుకే తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి రగులుతుందని ఆయన తెలిపారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితమైందంటే అయన స్వార్థపూరిత బుద్ది బట్టబయలైందని చెప్పారు. రైతులకు ఒక సారి మొక్కజోన్న వేయ వద్దని, ఇప్పుడు వరి వేయ వద్దని చెబుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ అమరుల సమాధుల పునాదుల మీద రాజ్యమేలుతూ అడుగడుగునా పక్షపాతం బందు ప్రీతి, అవినీతిలో తెలియాడుతున్నారని ఆయన అన్నారు.