తెలంగాణ సిఎం కేసీఆర్ ఇక దేశ రాజకీయాలలోకి వెళతారా? ఆయన వెళ్లిన తర్వాత తెలంగాణకు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? ఈ రెండు క్లిష్టమైన ప్రశ్నలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం చెప్పేశారు. దేశం కేసీఆర్ వైపు చూస్తున్నదని, యువత కేటీఆర్ వైపు చూస్తున్నదని మంత్రి అన్నారు.
కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం కావడం సహజమేనని ఆయన అన్నారు. ‘జనవరి 30న కేసీఆర్ సభ పెడతారని ఎవరు చెప్పారు?. ఓ పత్రికలో వచ్చిన వార్త చూసి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. మతం పేరుతో సమాజాన్ని, మనుషులను విడదీస్తే టీఆర్ఎస్ సహించదు. సెంటిమెంట్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. సీఎంను అన్ని పార్టీల నేతలు కలవొచ్చు.
ఏ ఎన్నికలు వచ్చినా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. భార్యనే గెలిపించుకునే సత్తా లేని ఉత్తమ్.. మాపై విమర్శలు చేయడమేంటి?’ అని ప్రతిపక్షాలపై శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయాలలో విస్త్రత చర్చకు దారితీసింది.