ఇటీవల 2023-24 బడ్జెట్లో టిఎస్ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయించిన సందర్భంగా సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి నివాసంలో ఎండీ, పువ్వాడను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సహకారంతో సంస్థ అభ్యన్నతి దిశగా పయనిస్తోందని చెబుతూ సంస్థ చేపడుతున్న వ్యూహాత్మక చర్యలను ఎండీ వివరించారు.
సంస్థ పురోభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం కొత్త బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్న విషయంపై కాసేపు చర్చించారు. నూతన రవాణా సేవలు ఎలా అందుతున్నాయని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో రోడ్డు రవాణా సంస్థల పరిస్థితి అంత బాగా లేవని, తెలంగాణ రాష్ట్రంలో టి.ఎస్.ఆర్టీసీ కి ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు
చేశారు. కరోనా విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని సంస్థ నిలబడగలిగిందని, ఇందులో సిబ్బంది, అధికారుల కృషి లేకపోలేదంటూ ప్రశంసించారు. టిఎస్ఆర్టీసీకి దేశంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉందని, ప్రజా రవాణా వ్యవస్థపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రయాణీకుల రవాణా అవసరాలను గుర్తించి సేవలను అందించాలని
మంత్రి అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. మంత్రిని కలిసిన వారిలో ఎండీతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్), సంస్థ కార్యదర్శి మునిశేఖర్, చీఫ్ పర్శనల్ మేనేజర్ కృష్ణకాంత్, చీఫ్ మేనేజర్ (ఫేనాన్స్) విజయ పుష్ప, తదితరులు కూడా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.