మైనారిటీ ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర రాజకీయాలు ఆపాలని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గోషామహల్ కు చెందిన గోవింద్ రాఠీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన అనుచరులు హిందు మతాన్ని కించపర్చడం సహించలేక పోయినట్లు రాఠీ తెలిపారు. దీనికి నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తనతో బాటు గోశామహల్ నియోజకవర్గానికి చెందిన మరికొందరు టీఆరెస్ నాయకులు కూడా టీఆరెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
2018లో ఆయన టీఆరెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కోసం పని చేస్తున్న ఆయన ఇటీవల హిందుత్వంపై టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న వైఖరితో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి సభలో కషాయం జెండాను బంగాళాఖాతంలో పడవేయాలని అన్నారని, హిందు సనాతన ధర్మానికి కెసిఆర్ మాటలు పెద్ద దెబ్బ అని ఆయన తెలిపారు. కషాయం జెండా హిందువుల ప్రతీక అని అలాంటి దాన్ని అవమానపరచడం సహించేది కాదని ఆయన తెలిపారు.
అంతరాత్మను చంపుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉండలేనని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కషాయం జెండాను బంగాళాఖాతంలో కలపాలనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎంత సెక్యూలర్ అయినా హిందుత్వాన్ని దెబ్బతీయడం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. హిందు ధర్మాన్ని కాపాడడానికి టీఆరెస్ పార్టీని విడుతున్నానని ఆయన తెలిపారు. నేటి నుండి టీఆరెస్ పార్టీ పై తన పోరాటం కొనసాగిస్తానని ఆయన అన్నారు.