చేతకాని వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా ఇంచార్జ్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరులో నేడు బీజేపీ కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న మహా ధర్నా కార్యక్రమానికి పోలీసుల అడ్డంకులు సృష్టించి అడ్డుకోవడం జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు.
ఏపీలో ప్రజాస్వామ్య రైతు ఉద్యమాలను పోలీసుల తూటాలు, లాఠీలు ఆపలేవని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు మద్దతుగా బిజెపి ఉద్యమానికి సిద్ధమైతే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటున్నదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉత్సవ విగ్రహంలా మారారని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మిస్తుంటే రాష్ట్రం భజన చేస్తుంది. ఒక్క వెయ్యి కోట్ల రూపాయలతో చిన్న చిన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు. వైసిపి ది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని రైతులే బంగాళాఖాతంలో కలుపుతారు అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
గత అర్ధరాత్రి నుంచి ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు చర్యను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.