అన్ని రంగాల అభివృద్ధిలో రోల్ మోడల్ గా ఖమ్మం నగరం యావత్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో త్రాగునీటి శాశ్వత పరిష్కారం లో భాగంగా
రూ.10.23 కోట్లతో ఖమ్మం నగరం 5 డివిజన్ల పరిధిలో 20వ డివిజన్ రామ చంద్రయ్య నగర్ లో రూ.1.80 కోట్లతో నిర్మించిన 10 లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్, 23వ డివిజన్ ఎస్.పి.ఆఫీస్ రోడ్ లో రూ.1.65 కోట్లతో నిర్మించిన 9లక్షల సామర్ధ్యం గల ట్యాంక్, 32వ డివిజన్ గుట్టల బజార్ లో రూ.3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్ధ్యం గల(బహుబలి)
ట్యాంక్, 53వ డివిజన్ ఎన్.ఎస్.పి. క్యాంపులోని రూ.1.80 కోట్లతో నిర్మించిన 10లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్, 43వ డివిజన్ జడ్.పి.సెంటర్ లో రూ.1.50కోట్లతో నిర్మించిన 8లక్షల లీటర్ల సామర్ధ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ లను నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా
మంత్రి మాట్లాడుతూ. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఖమ్మం నగర అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసిందన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్లలోనే సాధ్యమైందని మంత్రి అన్నారు.
ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు గా బాధ్యతలు చేపట్టిన నాడు ఖమ్మం నగరం అభివృద్ధికి నోచుకోక సరైన రోడ్లు లేక, త్రాగునీరు రాక, ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు, ఇరుకైన దారులు, రోడ్ల మీద చెత్త చెదారంతో దుర్గంధభరితంగా ఉండేదన్నారు.
ముఖ్యంగా ఖమ్మం త్రీ టౌన్లో త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని, దానిని నేడు శాశ్వతంగా పరిష్కరించగలిగామని, గుట్టల బజార్ లో రూ.3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్ధ్యం గల బహుబలి ట్యాంక్ తో మొత్తం గృహాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు. సొంత ఇంటిని శుభ్రం చేసుకున్న మాదిరిగా ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తు, అభివృద్ధి చేసుకుంటూ నేడు ఖమ్మం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువటం గర్వంగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ఖమ్మం నగరాన్ని ఒక రోల్ మోడల్ గా నిలిపామని పేర్కొన్నారు.
ఖమ్మం అభివృద్ధిలో భాగస్వాములు అయి తనవంతు కర్తవ్యంగా ఖమ్మంను టైర్ సిటీస్ వరుసలో నిలుపాలని దృఢంగా సంకల్పించుకున్నానని అది నేడు ఆచరణలో చేసి చూపించగలిగామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సహకారంతో నేడు ఖమ్మం నగరం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లుకు ఆదర్శంగా నిలువడం మనకు గర్వకారమన్నారు.
ఖమ్మం నగరంలో ఒకప్పుడు వాటర్ ట్యాంకులు గల గల అంటూ తిరుగుతానే ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఖమ్మం నగరం చిన్న చిన్న రోడ్లతో ట్రాఫిక్ సమస్యలతో ఉండేదని ఇపుడు ఎక్కడ ఏ రోడ్లు చూసినా నాణ్యమైన విడిఎఫ్ టెక్నాలజీతో సువిశాలంగా రోడ్లు విస్తరించామన్నారు., ఖమ్మంలో సరైన స్మశాన వాటిక ఒక్కటి కూడా ఉండేది కాదని. నేడు బల్లెపల్లి, కాల్వఒడ్డు వైకుంఠధామంల ముందు ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.
నగర ప్రజలకు, చిన్న పిల్లలకు ఆహ్లాదం కోసం ప్రతి డివిజన్లలో పార్కులు, ఓపెన్ జిమ్లు, పబ్లిక్ టాయిలెట్స్, తాగునీరు ఇలా అనేక వసతులు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం ప్రజా అవసరాల కోసం, అభివృద్ధి కోసం దాదాపు 2 వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందన్నారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో పార్కులు, ఓపెన్ జిమ్ లు, పబ్లిక్ టాయిలెట్స్, వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ లు, అన్ని ప్రాంతాలలో రైతు బజార్ లు, వాక్ వే లు,
సెంట్రల్ లైటింగ్ సిస్టం, వైకుంఠదామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఫుట్ పాత్ లు, మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరుకొసం నూతన ఓవర్ హెడ్ టాంక్ లు, అన్ని జంక్షన్ లలో కూడళ్లు, ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకుని ప్రజలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు అందిస్తున్నామని మంత్రి అన్నారు.
నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా చిన్న సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించి పరిష్కరించుకుంటున్నమని వివరించారు. అనంతరం అవతరణ ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఎస్.అర్.అండ్.బి జి ఎన్ అర్ మైదానం నుండి నూతన మున్సిపల్ కార్యాలయం వరకు మున్సిపల్ సిబ్బంది చే భారీ సంఖ్యలో చేపట్టిన వాహనాలతో ర్యాలీ ప్రదర్శనను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు.