టీడీపీ హయాంలోనే ఖమ్మం అభివృద్ది జరిగిందని చంద్రబాబు చెప్పారని, తెలంగాణలో ఏడు మండలాలు తీసుకుని, సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నది చంద్రబాబేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో పువ్వాడ సహచర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హాయాంలో ఖమ్మంకు ఒక్క ప్రాజెక్ట్ వచ్చినట్టు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తాను అని మంత్రి సవాల్ విసిరారు. ఇప్పుడు తామంతా చాలా సుఖంగా ఉన్నామని, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రాష్ట్రానికి దండయాత్రలాగా వచ్చాడన్నారు. భద్రాచలంకు పూర్తి కరకట్ట చంద్రబాబు కట్టి ఉంటే మొన్న వానకు నీళ్ళు వచ్చేవా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఖమ్మం సభలో కుటీల బుద్ధిని కపట నీతిని ప్రదర్శించారని ఏ మొహం పెట్టుకొని ఖమ్మంలో సభ పెట్టావ్ బాబు అంటూ ద్వజమెత్తారు. తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేసిన బాబు పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు మళ్ళీ బయలుదేరాడు అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తొలి రోజు నుంచి చంద్రబాబు కుట్ర బుద్ధులు బయటపడ్డాయన్నారు. ఎన్టీఆర్ ఓ విలక్షణమైన నేత అని, ఆయన సంస్కరణల గురించి సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పారన్నారు. కానీ, ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పోలవరానికి ఏడు తెలంగాణ మండలాలను చంద్రబాబు మోడీ మోహర్బానీతో గుంజుకుని ఖమ్మంలో గురువింద గింజల మాట్లాడుతున్నాడని వ్యవసాయం దండగ అని అన్నోడే తెలంగాణలో ఆ ప్రాజెక్టు కట్టాం ఈ ప్రాజెక్టు కట్టామంటూ కట్టు కథలు చెబుతున్నాడని రైతులను నిర్లక్ష్యం చేసి మేము ఓడిపోయామని 2004 ఓటమి తర్వాత చేసిన ప్రకటన చంద్రబాబు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని రైతుల అవమానపరిచిన వ్యక్తి నేడు ముసలి కన్నీరు ప్రదర్శిస్తున్నాడని బషీర్బాగ్ లో కరెంట్ చార్జీలు తగ్గించాలన్న రైతులపై కాల్పులు జరిపించి ముగ్గుని బలిగొన్నది నువ్వు కాదా బాబు అని మంత్రి ప్రశ్నించారు. నీ అవకాశవాద రాజకీయాలు ఏపీలో ప్రదర్శించుకో తెలంగాణలో కాదు అన్నారు. 2018లో మహాకూటమి పేరుతో తెలంగాణలో వసం చేసుకోవాలి కుట్ర పన్నితే ప్రజలు ఏకమై చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.