తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 13 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. కోవిడ్ -19 నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
మార్చి 13న ధ్వజారోహణం
శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 13న శనివారం ఉదయం 8 నుండి 8.10 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ జి.రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
13-03-21 (శనివారం) ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
14-03-21(ఆదివారం) చిన్నశేష వాహనం, హంస వాహనం
15-03-21(సోమవారం) సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
16-03-21(మంగళవారం) కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
17-03-21(బుధవారం) పల్లకీ ఉత్సవం, గరుడ వాహనం
18-03-21(గురువారం) హనుమంత వాహనం, వసంతోత్సవం/గజ వాహనం
19-03-21(శుక్రవారం) సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
20-03-21(శనివారం) సర్వభూపాల వాహనం, అశ్వవాహనం
21-03-21(ఆదివారం) చక్రస్నానం, ధ్వజావరోహణం