ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ నటేష్ బాబు, డిఎఫ్ఓ శ్రీనివాస్, ఏఈఓ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.