కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు బుధవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కళాబృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి.
త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు.
వాహనసేవలో ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో రమణప్రసాద్, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.