అధిక కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన ఛలో సెక్రటేరియేట్ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు కాంగ్రెస్ నాయకులను గృహనిర్భంధం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పోలీసులు ఆయన నివాసంలో ఉదయం 6 గంటలకే గృహ నిర్బంధం చేశారు. కోమటిరెడ్డి ఇంటి వద్ద పోలీసులను భారీ గా మోహరించారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశపాలన సాగిస్తున్నారని అన్నారు. కరోన సమయంలో అద్దె ఇళ్లకు అద్దె కూడా చెల్లించవద్దని చెప్పిన పెద్ద మనిషి కరెంటు చార్జీలు ఎలా వసూలు చేస్తాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. మూడు నెలలుగా ఉపాధి లేని ప్రజలు కరెంట్ భారాన్ని ఎలా మోస్తారని ఆయన ప్రశ్నించారు. కరోన కష్టకాలంలో ప్రజలపై ఇంత కక్ష్య సాధింపు చర్యలు ఎందుకు? అని ఆయన అడిగారు.
మూడు నెలలు స్వీయ గృహానిర్బంధం లో ఉన్న పేద ప్రజలకు ఆదాయం ఎక్కడి నుండి వస్తుందో ఆలోచించాలని కేసీఆర్ ను ఆయన కోరారు. కరెంటు బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే అరెస్టులు చేయడం అన్యాయమని ఆయన అన్నారు.