ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే అనే విధంగా తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నారు. తమ శాఖకు చెందిన డీఎస్పీ పైనే 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద కేసు నమోదు చేశారు. కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన కొత్తగూడెం డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని 14 రోజుల పాటు క్వారైంటన్లో ఉంచకుండా అతను నిబంధనలు ఉల్లంఘించాడు. దీంతో అతనిపై 1897 అంటువ్యాధుల నిర్మూలన చట్టం కింద కేసు నమోదైంది. లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.
దీంతో కొత్తగూడెం పోలీసు యంత్రాంగంలో కలవరం మొదలైంది. డీఎస్పీతో సహా అతని కుంటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్పీ కుటుంబం ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిసింది.