మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లమోతు మధుబాబు అనే వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మైలవరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మైలవరం పోలీసు స్టేషన్ హౌస్ అధికారి పి.రాంబాబు కి ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఇబ్రహీంపట్నంకు చెందిన నల్లమోతు మధుబాబు అనే వ్యక్తి స్థానిక శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి సంబంధం లేని విషయంలో ఆయన వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని వైకాపా నాయకులు పేర్కొన్నారు.
నల్లమోతు మధుబాబు వైఖరి పట్ల ఎమ్మెల్యే అభిమానులమైన తాము తీవ్ర మనోవేదనకు గురయ్యామన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా మధుబాబు ప్రవర్తన ఉందన్నారు. అతనిపై చట్టప్రకారం చర్యలతో పాటు వైకాపా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
అతని ఆటవిక చర్యలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తాయన్నారు. పార్టీ అధిష్టానం తక్షణమే స్పందించాలని స్థానిక వైకాపా నేతలు డిమాండ్ చేశారు.