బాలీవుడ్ నటి కృతి సనన్ తన సహనటుడు ప్రభాస్తో ఎఫైర్ ఉందనే పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె ప్రభాస్ గురించి మాట్లాడటం కనిపించింది. వీరి డేటింగ్ వార్త విన్న అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ, కృతి మాత్రం ఈ విషయాలను ఖండిస్తున్నది. తన ఇన్స్టాగ్రామ్లో ఈ మేరకు కృతి సనన్ వివరణ ఇచ్చింది.
తన సహనటుడు వరుణ్ ధావన్ తనను ఆటపట్టించడానికి, రియాలిటీ షోలో తనపై జోక్ గా మాట్లాడాడని అందువల్లే ఇలాంటి పుకార్లు వస్తున్నాయని స్పష్టం చేసింది. ‘ఇది ప్రేమ కాదు, పబ్లిక్ రిలేషన్ కాదు. తోడేలు సినిమా ప్రమోషన్ కోసం జరిగిన ఒక రియాలిటీ షోలో కొంచెం మోతాదు మించడంతో పరిహాసం కోసం వచ్చిన ఈ విషయం కొన్ని పుకార్లకు దారితీసింది’ అని కృతి చెప్పింది.
ఆ షోలో వరుణ్ ధావన్ ను ‘కృతి ఎవరి గుండెల్లో ఉంది’ అని అడగగా, ‘ముంబైలో ఉండని ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రస్తుతం దీపికా పదుకొనేతో కలిసి షూటింగ్లో ఉన్నాడు’ అని వరుణ్ బదులిచ్చారు. ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు స్పష్టమైంది. కృతి సనన్ కూడా తనకు అవకాశం వస్తే ప్రభాస్ని పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ పుకారు నిజమనే వార్తలు గుప్పుమన్నాయి. కృతి త్వరలో ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించనుంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.