కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు భారీ నష్టం కలుగుతుందని రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సాగు చట్టాలను టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన అన్నారు.
షాద్నగర్ బూర్గుల గేట్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన నేడు ఆందోళన చేపట్టారు. గత కొన్నిరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు వరంగా మారి రైతుల హక్కులు హరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకునే ప్రమాదం ఉందన్నారు. కొత్త చట్టాలతో రైతులకు, వినియోగదారులకూ నష్టమేనని కేటీఆర్ తెలిపారు. నూతన చట్టంలో మద్దతు ధర అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరమని కేటీఆర్ పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు భారత్ బంద్లో పాల్గొన్నారు. రైతులు టెర్రరిస్టులు కాదు అనే ప్లకార్డును కేటీఆర్ ప్రదర్శించారు. అలంపూర్ వద్ద జాతీయ రహదారిపై మంత్రి నిరంజన్ రెడ్డి, తూప్రాన్ వద్ద మంత్రి హరీశ్రావు,
హైదరాబాద్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, హన్మకొండ-వరంగల్ హైవేపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్దపల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కామారెడ్డి శివారులోని ఎల్లారెడ్డి పరిధిలోని టెక్రియాల్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరసనలో పాల్గొన్నారు.