ఏఐసీసీ పిలుపు మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక కార్పొరేట్ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని T.P.C.C జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్ నగర్ పట్టణ బంద్ నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించి, రహదారిని దిగ్బంధించి భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అజీజ్ పాషా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, కస్తాల శ్రవణ్ కుమార్, జక్కుల మల్లయ్య తదితర పార్టీ ముఖ్య నాయకులు, అఖిలపక్ష ప్రముఖ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులతో రైతులకు తీరని అన్యాయం జరిగిందని, అందుకే దేశ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారని అన్నారు.
పాలించడం చేతకాక ఇప్పటికే అన్ని వ్యవస్థలను కార్పొరేట్ లకు కట్టబెడుతున్న బీజేపీ ప్రభుత్వం చివరికి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టిందని ధ్వజ మెత్తారు.
ఈ చట్టం ద్వారా రైతులు తమ స్వంత వ్యవసాయ పొలంలో కూలీలుగా మారనున్నారని, ఈ బిల్లులను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.తెరాస ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీలో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
కొత్త వ్యవసాయ బిల్లులతో బీజేపీ ప్రభుత్వం రైతన్న నోట్లో మట్టి కొట్టిందని,కేంద్ర వ్యవసాయ బిల్లులతో చట్టబద్ధత లేని మద్దతు ధరతో రైతాంగం తీవ్ర ఇక్కట్లు పడుతుందని,వెంటనే కేంద్రం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, అఖిలపక్ష నేతలు, రైతులు, రైతు సంఘం నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.