కమలానికి కన్ను కొట్టిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డి కారుకు కూడా బేరం పెట్టారని తెలిసింది. టీఆర్ఎస్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అధికార టీఆర్ఎస్, ఇటీవల ఊపులోకి వచ్చిన బిజెపి హోరా హోరీగా అప్పుడే పోరాటం ప్రారంభించిన విషయం తెలిసిందే.
అభ్యర్ధి ఎంపిక దగ్గర మల్లగుల్లాలు పడుతున్న బిజెపి సరైన అభ్యర్ధి కోసం వెతుకులాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకుడు కుందూరు జానారెడ్డి కానీ, ఆయన కుమారులలో ఒకరు కానీ బిజెపిలో చేరి పోటీ చేస్తే టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనవచ్చునని భావించారు.
ఇదే అదనుగా అనుకున్న జానారెడ్డి తనకు గవర్నర్ పోస్టు ఇస్తే తన కుమారుడు బీజేపీ తరపున పోటీ చేస్తారని బిజెపితో బేరం పెట్టారు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే తన కుమారుడు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తారని ఆయన చెబుతున్నారని తెలిసింది.
ముందు పార్టీలో చేరండి ఆ తర్వాతే ఏదైనా అని బిజెపి చెప్పిన తరహాలోనే టీఆర్ఎస్ కూడా షరతులతో పార్టీలోకి రావడాన్ని స్వాగతించడం లేదు. పైగా హెవీ వెయిట్లను పార్టీలోకి తీసుకుంటే ఏమౌతుందో డి.శ్రీనివాస్ ఉదంతం తెలియ చెప్పడంతో టీఆర్ఎస్ మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని నెత్తిన ఎక్కించుకోవడానికి సాహసించడం లేదు.
దాంతో జానారెడ్డి కోరికను టీఆర్ఎస్ పార్టీ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. అయితే జానా రెడ్డి లాంటి నాయకుడు టీఆర్ఎస్ లోకి వస్తే నాగార్జున సాగర్ లో తీర్పు ఏక పక్షంగా ఉంటుందని, నాగార్జున సాగర్ గెలిస్తే మిగిలిన రోజులు సుఖంగా ఉండవచ్చునని టీఆర్ఎస్ లోని మరో వర్గం వాదిస్తున్నది.
పొరబాటున నాగార్జున సాగర్ లో బిజెపి గెలిస్తే ఇక తాము పరిపాలించలేమని టీఆర్ఎస్ లోని కొందరు అంటున్నారు.