కేంద్ర ప్రభుత్వం కరోనా సహాయంగా కోట్ల రూపాయలు ప్రకటించినా గ్రామాలలో ఉన్న పేదలకు అందడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని విమర్శించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం నుండి వచ్చే సహాయం అందడం లేదని బ్యాంకుల్లో రావాల్సిన డబ్బులు సాంకేతిక లోపాల పేరుతో ఇంకా పేదవాడికి అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హమీ పనిచేసిన కూలీలకు నీళ్లు , గడ్డపార మెున పెట్టినందుకు అన్ని రకాల బిల్లులు కలిపి మొత్తం రూ.156/- మాత్రమే కూలి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హమీ పని ప్రదేశాల్లో అధికారుల పర్యవేక్షణ కరువైందని తక్షణమే అధికారులు స్పందించి కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు లాడే రాములు మండల కార్యదర్శి అరూరి నర్సింహా నాయకులు తిమ్మయ్య, శ్రీను, నరసింహ, రాములు, అంజయ్య, లలిత, సునీత, అండాలు, రాములమ్మ, లక్ష్మి ,శ్రీలత,భారతమ్మ,కవిత తదితరులు పాల్గొన్నారు.