మానసిక రోగులను కొట్టి చంపుతున్న సంఘటనలు పాకిస్తాన్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. అమానవీయమైన ఈ సంఘటనల పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ చర్యలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు.
సియాల్కోట్ లో మానసిక రోగిని రాళ్లతో కర్రలతో కొట్టి చంపిన సంఘటన మరువక ముందే ఖనేవాల్ లో కూడా అలాంటి దుర్ఘటన జరిగింది. అంతకుముందు ఫైసలాబాద్లో పగటిపూట ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే అక్కడి పోలీసులు గుంపును అదుపు చేసి నిందితుడి ప్రాణాలను కాపాడగలిగారు. ఖనేవాల్ గ్రామంలో మియాన్ చన్నుఅనే మానసిక వికలాంగుడు ఉండేవాడు.
అతను 17 నుండి 18 సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. ఏళ్ల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కోలుకోలేకపోయాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మానసిక వికలాంగుడు అయిన అతడిని అదే విషయంపై భార్య విడిపోయింది. కరాచీలో అతను తన సోదరుడితో అతను నివసిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట అతడిని ఖనేవాల్ లోని మరో సోదరుడి ఇంటికి తీసుకువచ్చారు. అతని మానసిక స్థితి గురించి స్థానికులకు కూడా తెలుసు.
రెండు రోజుల కిందట అతను సిగరెట్ లు కొనేందుకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతను దైవ దూషణకు పాల్పడ్డందుకు రాళ్లతో కొట్టి చంపారని ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసింది. అతను సిగరెట్ లు కొనేందుకు వెళ్లి అక్కడి మాసీదులోకి చొరబడ్డాడు. అక్కడ పవిత్ర ఖురాన్ ను చూసి దాన్ని నిప్పు పెట్టి కాల్చాడని అంటున్నారు. ఇది చూసిన అక్కడి స్థానికులు అతడిని రాళ్లతో కొట్టి చంపారు.
విషయం బయటకు రావడంతో దేశం మొత్తం ఆందోళన చెలరేగింది. మత సామరస్యంపై ప్రధానమంత్రి సలహాదారుడు అల్లామా తాహిర్ అష్రాఫీ ఖనేవాల్కు చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ప్రపంచంలోని ఏ ముస్లిం దేశంలో ఇలా జరగడం లేదని, ఇలా మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించదని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి సంఘటనలు దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దాంతో విధినిర్వహణలో విఫలమైన పోలీసులను విధుల నుంచి తప్పించారు. మొత్తం 85 మందిని అరెస్టు చేశారు. తన సోదరుడిని రాళ్లతో కొట్టి చంపడానికి ముందు వేళ్లు కూడా ఖండించారని అతని సోదరుడు కన్నీటి పర్యంతం అయి చెప్పారు. తన సోదరుడిని రాళ్లతో కొట్టి చంపిన సంఘటన పోలీసుల కళ్లెదుటే జరిగిందని కూడా అతను చెప్పాడు.