మెరుగైన ప్రజా రవాణా కోసం లహరి-అమ్మఒడి అనుభూతి పేరుతో అధునాతన బస్సులను టీఎస్ ఆర్టీసి ప్రవేశపెట్టిందని, ఆర్టీసి ప్రయాణం సురక్షితం, దూర ప్రాంతాలకు ఇక మరింత విలాసవంతంగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని విజయవాడ మార్గంలో సోమవారం ఏసీ స్లీపర్ బస్సులను మంత్రి పువ్వాడ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. కొత్త బస్సుల కొనుగోలుతో ప్రయాణీకులకు మరిన్ని సేవలు అందుతాయని, టి.ఎస్.ఆర్.టి.సి కొత్త బస్సుల కొనుగోలు నిమిత్తం టెండర్ల ద్వారా ఛాసిస్ మరియు పూర్తిగా నిర్మిత బస్సుల సరఫరా కోసం అశోక్ లేలాండ్ మరియు టాటా మోటార్స్ కంపెనీలకు ఆర్డర్స్ ఇవ్వడమైనదన్నారు. ఇందులో 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్ మరియు 16 ఏసీ స్లీపర్ బస్సులతో కలిపి మొత్తం 776 బస్సుల కొనుగోలుకై ప్రణాళిక రూపొందించడమైనదని, ఏసీ స్లీపర్ కోచ్ల కొనుగోలు కొసం అశోక్ లేలాండ్ కంపెనీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఛాసిస్ అశోక్ లేలాండ్ నుంచి మరియు బస్ బాడీ అశోక్ లేలాండ్ అధీకృత బస్ బాడీ ఫ్యాబ్రికేటర్ శ్రీ దామోదర్ కోచ్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా నిర్మించబడిందన్నారు.సంస్థ మొత్తం 9164(ఆర్టీసీ-6362, అద్దె బస్సులు-2802) బస్సులతో 8554 షెడ్యూల్లను నిర్వహిస్తూ, 33 లక్షల కిలోమీటర్ల వరకు తిప్పుతూ, రోజుకు సుమారు 45 లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయడం జరుగుతోందని స్పష్టం చేశారు.
130డీలక్స్ బస్సుల సేకరణకై అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ లిమిటెడ్ కు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఈ బస్సుల బాడీ కోసం సంస్థకు చెందిన బి.బి.యు, మియాపూర్ (బస్ బాడీ యూనిట్)కు అప్పగించడమైనదన్నారు. పూర్తిగా నిర్మించిన 16 AC స్లీపర్ కోచ్ బస్సుల కొనుగోలు కోసం అశోక్ లేలాండ్కు ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, 16 AC స్లీపర్ కోచ్లలో, ప్రస్తుతం 10 కొత్త AC స్లీపర్ కోచ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ ఏసీ కోచ్ బస్సుల్ని ఎల్.బి.నగర్ నుంచి ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తెచ్చిందని, మారుతున్న జీవన ప్రమాణాలను అనుగుణంగా ప్రజా రవాణాలో మెరుగైన సేవలు, వసతులతో కూడిన ప్రయాణం ను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు నేటి నుండి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడుపుతుంది అని అన్నారు.