హైదరాబాద్ పాతబస్తీ లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయ మాజీ చైర్ పర్సన్, ముఖ్యసలహాదారు జి.మహేష్ గౌడ్ ఆకస్మిక మరణం పట్ల ‘హైదరాబాద్ పాతనగర కవుల వేదిక’ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం ప్రతి సంవత్సరం జరుపుకునే ‘బోనాలు’ పండుగలో కీలక పాత్ర వహించే మహేష్ గౌడ్ ఆకస్మిక మరణం తీరని లోటని హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సెక్రటరీ కె.హరనాథ్ అన్నారు.
చారిత్రాత్మకమైన ప్రాధాన్యత ఉన్న ఈ ఆలయానికి ఆయన ముఖ్య ఆయువు పట్టు. చైర్ పర్సన్ ఎవరున్నా ఆలయ నిర్వహణ ఆయన సలహాతోనే జరుగుతుండేది. హైదరాబాద్ లోని మరికొన్నిదేవాలయాలకు కూడా ఆయన ఆధ్వర్యం, సలహాలతోనే బోనాలు జరుగుతుండేవి. పాతనగరం ఒక మహా దిగ్గజాన్నికోల్పోయింది. పాతబస్తీలో దేవాలయాలను నిర్వహిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటమే కాకుండా ఎంతోమంది కవులని, కళాకారులని ప్రతి సంవత్సరం ’ఢిల్లీ’ తెలంగాణా భవన్’కు ఆహ్వానించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన నిర్వహించేవారని హరనాథ్ గుర్తు చేశారు.
ఢిల్లీ గేట్ నుంచి బోనాలు పండుగ ప్రారంభించటం కూడా మహేష్ గౌడ్ ఆధ్వర్యంలోనే జరుగుతుండేది. దానికి ’హైదరాబాద్ పాతనగర కవుల వేదిక’ ముఖ్య వేదికగా నిలిచింది. ఈ విషయంలో తనయులు అరవింద్ సహకారం ఎంతగానో ఉండేది. ఏదేమైనా ఓ మహోన్నత ఆశయాలున్న వ్యక్తిని కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.