సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసమే భూముల రీ సర్వే చేపడుతున్నామని విజయనగరం సర్వే, భూమి రికార్డుల విభాగ సహాయ సంచాలకులు టి. త్రివిక్రమరావు పేర్కొన్నారు. సంబంధిత ప్రక్రియను సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా జిల్లాలో పలు చోట్ల చేపట్టిన రీ సర్వే ప్రక్రియ ఆశాజనకంగా సాగుతోందని పేర్కొన్నారు.
జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వే, పైలెట్ ప్రాజెక్టుల గురించి సర్వే విభాగం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న భూ రక్ష పథకంలో భాగంగా పైలెట్ గ్రామాలైన పార్వతీపురం డివిజన్ పరిధిలోని రామభద్రపురం మండలం మర్రివలసలో, విజనగరం డివిజన్ పరిధిలోని దత్తిరాజేరు మండలం లక్ష్మీపురంలో మొత్తం 1271 సర్వే నెంబర్ల తాలూక భూముల్లో అత్యంత ఖచ్చితమైన కొలతలతో రీ సర్వే చేయించామని వివరించారు.
ఇప్పటి వరకు 111 గ్రామాల్లో డ్రోన్ సర్వే కూడా పూర్తి చేశామని తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో, పరికరాలతో రీ సర్వే ప్రక్రియ జరుగుతోందని, ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది, ప్రజల సహాకారంతో రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ఏడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ ఇన్స్పెక్టర్ బి.బి.బి. రాజు, సర్వే విభాగపు ఇతర అధికారులు ఉన్నారు.