ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం గ్రామ శివారు మూడుముళ్ల రేవు వద్ద ఉన్న ఖాళీ భూములను నిరుపేద రైతులకు ఇవ్వాలని మూడు మళ్ళ రేవు రైతు సంఘం డిమాండ్ చేసింది.
వేటపాలెం లోని ఓరుగంటి రెడ్డి వీధిలో ఆదివారం సాయంత్రం భూమి లేని రైతులతో సంఘం సమావేశం నిర్వహించింది. సంఘం అధ్యక్షులు మీసాల వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మూడు మళ్ళ రేవు వద్ద గత పది రోజులుగా బీడు భూములను సాగు లోనికి తీసుకురావడానికి రైతులు చేస్తున్న కృషిని సంఘం అభినందించింది.
గత 20 సంవత్సరాలుగా బీడు భూములు గా ఉన్న పులగ కాలువ ఎగువ భూములను సాగు లోనికి తీసుకు రావడం ద్వారా నిరుపేద రైతుల కుటుంబాలకు సరిపడా తిండిగింజలు పండించే అవకాశం ఉంటుందని సంఘం అభిప్రాయపడింది. సంఘం అధ్యక్షులు మీసాల వెంకయ్య మాట్లాడుతూ… కొందరు వ్యక్తులు సదరు భూములు మాసొంతం అంటూ సాగు చేస్తున్న రైతులకు ఆటంకాలను కలగచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలో చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణ మూర్తి ని స్వయంగా కలిసి సాగుచేస్తున్న భూముల విషయం వారి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు సాగు చేసుకునే అవకాశం కల్పించే విధంగా కోరుతామని వారు తెలిపారు.
సంఘ నాయకులు బట్టు మస్తాను, చల్లా సుబ్బారావు, కాటి దాసు, పుట్టా నాగేశ్వరరావులు మాట్లాడుతూ దశాబ్దాలుగా కాళీగా ఉన్న భూములను సంఘం ఆధ్వర్యంలో సాగుబడి చేస్తుంటే కొందరు వ్యక్తులు కావాలని కులం పేరుతో ఇతరులను రెచ్చగొట్టి సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపారు.
సమావేశంలో రైతులు యర్రవరపు కిరణ్, ఈమని వీరయ్య, కుమ్మరి వీరారెడ్డి, భోగి రెడ్డి వెంకటశివారెడ్డి, ఒలుకుల అయ్యప్ప, కొమరగిరి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.