రానున్నభారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని అందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన రానున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయన సంబంధిత శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.ఈవేడుకలను విజయవంతంగా సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా గణతంత్ర దినోత్సవ పరేడ్ ఛీఫ్ కోఆర్డినేటర్ సంబంధిత విభాగాలు, సంస్థల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్,ముఖ్యమంత్రి,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులు పాల్గోనున్న నేపధ్యంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్.డా.జవహర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వెంటనే మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని సిద్ధం చేసి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వివిఐపిల రాకపోకలకు సంబంధిత వ్యక్తిగత కార్యదర్శులతో సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసే విఐపి వాహనాలు సహా ఇతర వాహనాలకు సంబంధించి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకల రిహార్స ల్స్ నిర్వహించాలని అదే విధంగా ఈనెల 24 తేదీన ఫుల్ డ్రస్ రిహార్సల్స్ నాటికి పరేడ్ ను పూర్తిగా సిద్ధం చేయాలని సిఎస్ చెప్పారు. వివిఐపి,విఐపిలు ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని,ప్రధాన వేదికను ఫ్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించాలని,స్టేడియంలో పోర్ట్ వాల్ డిజైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో మరింత విస్తృత అవగాహన కల్పించేలా వివిధ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు,పధకాలపై వివిధ శాఖలకు చెందిన శకటాలను(టాబ్లూస్) ఆకర్షణీయంగా రూపొందించి శకటాల ప్రదర్శనకు సిద్ధం చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సికింద్రాబాద్ నుండి ఒక పైపు బ్యాండ్ ఆర్మీ కంటెంజెంట్ తోపాటు రాష్ట్ర పోలీస్ బెటాలియన్స్,ఎన్ సి సి,స్కౌట్స్ అండ్ గైడ్స్, పోలీస్ బ్యాండ్ వంటి విభాగాలు కవాతులో పాల్గొంటాయని పేర్కొన్నారు.ఈవేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.26వ తేది సాయంత్రం రాజ్ భవన్ నందు నిర్వహించే తేనీటి(High Tea) విందుకు రాజ్ భవన్ అధికారుల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి డా.జపహర్ రెడ్డి ఆదేశించారు.
ఈవీడియో సమావేశంలో ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యంరెడ్డి,ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు,సంయుక్త కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్,మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్,విజయవాడ సబ్ కలెక్టర్ అదితి సింగ్,సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్,కస్తూరి తేళ్ళ తదితరులు పాల్గొన్నారు.అదే విధంగా వీడియో లింక్ ద్వారా పోలీస్, వైద్య ఆరోగ్య,విద్యుత్,రవాణా,అగ్నిమాపక,ఎన్సిసి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.