నాలుగేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు…!
సరిగ్గా 2019 లో జరిగిన హత్య కేసులో నిందితురాలు అడ్డూరి విజయలక్ష్మికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ విజయనగరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి బి.కళ్యాణ్ చక్రవర్తి తీర్పు వెల్లడించారు. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం, తుమ్మికాపల్లికి చెందిన అడ్డూరి విజయలక్ష్మి (35) తన భర్త అడ్డూరి దేవుడు తరచూ ఆమెను అనుమానించి, మానసికంగా వేధిస్తున్నాడని అతడిని హత్య చేసింది. ఈ విషయమై కొత్తవలస పోలీసు స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కొత్తవలస ఎస్ఐ మురళి కేసు నమోదు చేయగా, అప్పటి కొత్తవలస సీఐ జి.గోవిందరావు దర్యాప్తు చేపట్టి, నిందితురాలిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేసారు.
కోర్టు విచారణలో నిందితురాలు అడ్డూరి విజయలక్ష్మి పై నేరారోపణలు రుజువు కావడంతో నిందితురాలికి, విజయనగరం డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి బి. కళ్యాణ చక్రవర్తి జీవిత ఖైదు , 1000/- జరిమానా విధించారు. ఈ కేసులో పోలీసుల తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురామ్ వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబులు సిహెచ్. వెంకటేష్ కోర్టులో సాక్ష్యులను సకాలంలో హాజరపర్చి, ప్రాసిక్యూషన్ త్వరితగతిన అయ్యే విధంగా సహకారాన్ని అందించినట్లుగా కొత్తవలస సీఐ ఎస్.బాల సూర్యారావు తెలిపారు. పోలీసు స్టేషన్లో నమోదైన కేసుల్లో ఈ కేసును జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఇటీవల జరిగిన నేర సమీక్ష సమావేశం లో త్వరితగతిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేకూర్చే లా విచారణ చెయ్యాలని ఆదేశించారు. దీంతో కొత్త వలస సీఐ బాల సూర్య రావు.. ప్రాధన్యత కేసుగా తీసుకొని, త్వరితగతిన ప్రాసిక్యూషన్ పూర్తి చేసి, ముద్దాయికి శిక్షపడే విధంగా చర్యలు చేపట్టారు.