విధి నిర్వాహణలో విద్యుదాఘాతానికి గురై చనిపోయిన లైన్ మెన్ కొలుపుల రవి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొరిగే రమేశ్ కురుమ, ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షుడు రేవు కృష్ణ కురుమ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం ఉప్పల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. చిలుకానగర్ ప్రాంతంలోని పలు ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఫిర్యాదు రావడంతో అక్కడకు వెళ్లి, విద్యుత్ స్తంభంపై మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై చనిపోయిన సంఘటన కలిచివేసిందని అన్నారు.
హబ్సిగూడ డివిజన్ పరిధి చిలుకానగర్ సెక్షన్ అసిస్టెంట్ లైన్మెన్గా పని చేస్తున్న రవికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు.
సరియైన భద్రత తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్రం ప్రభుత్వం ఆదుకొని ఎక్స్గ్రేషియా ప్రకటించి , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. బాధితులకు న్యాయం చేయకపోతే కురుమ సంఘం తరుఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఉప్పల్ కురుమ సంఘం అధ్యక్షుడు గొరిగే ఐలయ్య కురుమ, సెక్రటరీ కర్రె శ్రీనివాస్ కురుమ, శ్రీ బీరప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చిందం వెంకటేశ్ కురుమ, గొరిగే నర్సింహ కురుమ తదితరులు ఉన్నారు.