బెంగాల్ తరహా లోనే త్రిపురలో కూడా బీజేపీ -తృణమూల్ కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తోంది. త్రిపుర రాజధాని అగర్తలా లో మహిళా పోలీసు స్టేషన్ లోనే తృణమూల్ కార్యకర్తలపై దాడి జరగడం సంచలనం రేపింది. తృణమూల్ యూత్వింగ్ ప్రెసిడెంట్, సినీ నటి సయోనిఘోష్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పోలీసు స్టేషన్లో సయోనిఘోష్ కలవడానికి వచ్చిన టీఎంసీ కార్యకర్తలపై పోలీసుల సమక్షం లోనే దాడి జరిగింది. ఓ కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. త్రిపుర సీఎం బిప్లవ్దేవ్ సభలో నిరసన తెలిపారని సయోనిఘోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాన్ బెయిలెబుల్ కేసు పెట్టడంతో టీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
సయోనిఘోష్ అరెస్ట్ పై తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో అక్రమ అరెస్ట్ లకు నిరసనగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. 15 మంది టీఎంసీ ఎంపీలు ఢిల్లీలో ఈ వ్యవహారంపై ఆందోళన చేయాలని నిర్ణయించారు.