మద్యం దుకాణ దారులు సిండికేట్ గా మారి అధిక ధరలకు విక్రయిస్తే కలెక్టరేట్, ఎక్సైజ్ శాఖల టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా, పోలీస్ శాఖ డయల్ 100, వాట్స్ అప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మద్యం ధరల పట్టిక, అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లు కలిగిన పట్టికను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏ.వి.రంగనాధ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంకరయ్య ఆవిష్కరించారు.
అధిక ధరలకు మద్యం అమ్మకుండా నిరంతర నిఘా
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఎస్పీ ఏ.వి.రంగనాధ్ మాట్లాడుతూ మద్యం దుకాణదారులు సిండికేట్ గా మరి ప్రభుత్వం నిర్దేశించిన ధరల కన్నా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖతో పాటు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలపై నిఘా పెట్టినట్లు చెప్పారు.
మద్యం ధరల పట్టికను పాటు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నెంబర్లు, వాట్స్ అప్ నెంబర్లతో రూపొందించిన పోస్టర్లను అన్ని వైన్ షాపుల వద్ద ఏర్పాటు చేయనున్నామన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ ఫేస్ బుక్, ట్విట్టర్ల ద్వారా సైతం మద్యం అధిక ధరలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
మద్యం దుకాణాల లైసెన్స్ దారులు విధిగా లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, సాయంత్రం 6.00 గంటల కల్లా షాపులు మూసివేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినా, అధిక ధరలకు మద్యం విక్రయించినా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.
డయల్ 100 ద్వారా పిర్యాదు చేయవచ్చు
శాంతి భద్రతల సమస్యలతో పాటు లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పోలీసులను ఆశ్రయించడానికి ఏర్పాటు చేసిన డయల్ 100 నెంబర్ ద్వారా మద్యం అధిక ధరల విక్రయాలు, సిండికేట్ గా మారిన వ్యాపారుల వివరాలు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు అందుకున్న నిమిషాల వ్యవధిలోనే సంబంధిత పోలీస్ అధికారులు అలాంటి వారిపై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.