ఆమె ఒక కింది స్థాయి పోలీసు అధికారి….. తన ఉద్యోగం తాను చేసుకుని వెళితే సరిపోతుంది…. అయితే అలా అనుకోలేదు ఆమె.
సమాజానికి ఆదర్శంగా నిలవాలనే అనుకున్నారు ఆమె. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభ్యమైంది.
అక్కడ నుంచి మృతదేహాన్ని తరలించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. ఏం చేయాలి? కాశీబుగ్గ మహిళా ఎస్.ఐ. శిరీష వేరే విషయాలు ఏవీ ఆలోచించలేదు. ఒక స్థానికుడిని ఆసరాగా తీసుకుని ఆ అనాధ శవాన్ని ఆమే స్వయంగా మోశారు.
అనాధ మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు ఆ మహిళా ఎస్ ఐ శిరీష లలితా చారిటబుల్ ట్రస్ట్ కు ఆప్పజెప్పారు.
ఎస్ ఐ శిరీష చేసిన ఈ పనికి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆమెను అభినందిస్తున్నారు. రాష్ట్ర పోలీసులకు ఆదర్శంగా నిలిచిన ఎస్ ఐ శిరీషకు శాల్యూట్.