హనుమంతుని జన్మస్థలం సప్తగిరుల్లోని అంజనాద్రిగా ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినాన తగిన ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధంకావాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి పండితులను కోరారు. టిటిడి పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో సోమవారం ఆయన ఈ అంశంపై పండితులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పవిత్రమైన శ్రీరామనవమినాడు శ్రీవారి ఆలయంలో పూజల అనంతరం ఆలయం ముందు ఉన్న నాదనీరాజనం వేదికపై ఉదయం 11 గంటలకు హనుమంతుని జన్మస్థలంను మీడియా ద్వారా తగిన ఆధారాలతో భక్తులకు తెలియజేయాలన్నారు.
అనంతరం అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు దక్షిణామూర్తి శర్మ, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.