టిఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే L.R.S ను రద్దు చేయాలని, కరోనా కాలంలో ప్రజలంతా అభద్రతా భావంతో ఉండగా ఈసమయంలో (కోవిడ్ -19) కరోనా కంటే L R S కు ఎక్కువ భయపడుతున్నారని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన సూర్యాపేట జిల్లా పర్సనల్ కలెక్టర్ పద్మజారాణి కి వినతి పత్రం సమర్పించిన అనంతరం రోశపతి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ప్రజలకు ఇంత పెద్ద మోయలేని బహుమతి ఇస్తారని ప్రజలు ఊహించలేదని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడతారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వస్తాయని, కార్మిక, కర్షక రంగాలకు మేలు చేకూరుతుందని రాష్ట్ర ప్రజలు ఆనందపడితే “అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి” అన్న చందంగా ప్రజల్ని పీడించి నిలువు దోపిడీ చేసే ప్రభుత్వం వస్తుందని కలలో కూడా ప్రజలు ఊహించలేదని ఆరోపించారు.
ఒకప్రక్క నిత్యవసర వస్తువులు, మరోపక్క కూరగాయల ధరలు విపరీతంగా పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతుంటే పెరిగినా వాటిపై ప్రభుత్వం శ్రద్ధ చూపకుండా, ధరల నియంత్రణ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఉద్యోగ భద్రత లేక అనేక అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రజలపై పిడుగులాంటి L.R.S చట్టాన్ని చేయటం ప్రజాస్వామ్యంలో ప్రజావ్యతిరేకమే అవుతుందని అన్నారు. తక్షణమే L.R.S ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రియల్ ఎస్టేట్ బడా వ్యాపారులు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా ఎగవేసి మోసాలకు పాల్పడుతున్న వారిని అరికట్టవలసిందే, కానీ ప్రజలందరి పై ఈ భారం మోపడం సరైనది కాదని అన్నారు.
దీనిపై 1వ,తేది గురువారం కలెక్టర్ కార్యాలయం ముట్టడికి సిపిఎం పార్టీ ఇచ్చిన పిలుపులో పెద్ద ఎత్తున కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు యలక సోమయ్య గౌడ్, శ్రీనివాసరెడ్డి, ఎస్.కె అజ్జు, నజీర్, శివ, గోపి, ప్రభాకర్ ,వెంకటేశ్వర్లు, మణి, తదితరులు పాల్గొన్నారు.