ప్రజా సంబంధాలలో తనదైన శైలిలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించిన మధు వాకిటి రచించిన సమాజానికి స్నేహ హస్తం పుస్తకాన్ని ఈ నెల 22న రవీంద్రభారతి కాన్ఫరెన్సు హాల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె వి రమణాచారి ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ భాష, సంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ వై బాబ్జి హాజరు అవుతున్నారు.
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ జుర్రు చెన్నయ్య పుస్తకాన్ని సమీక్షిస్తారు. ఈ కార్యక్రమానికి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. పుస్తక రచయిత మధు మిర్యాలగూడా లో జన్మించి ఈనాడు విలేఖరిగా ప్రస్థానం ప్రారంభించారు.
దూరదర్శన్ న్యూస్ రీడర్ గా, ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు. ఇప్పటికి ప్రగతికి సోపానాలు ప్రజా సంబంధాలు, వందేళ్ల సినిమాకు వందనం పుస్తకాలను ఆయన రచించారు. నిత్య నూతన స్ఫూర్తితో ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ఆయన పని చేస్తున్నారు. ప్రజా సంబంధాల సొసైటీ జాతీయ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.