నిర్మల్ జిల్లా వెల్మల్-బొప్పారం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1160 కోట్ల అంచనా వ్యయం తో నిర్మించిన 400/220 కే వి విద్యుత్ కేంద్రాన్ని ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లతో కలసి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. యావత్ భారతదేశంలోనే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మోడీ ఏలుబడిలోనీ గుజరాత్ లో కానీ, సోనియమ్మ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఉచిత విద్యుత్ ఊసే లేదని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ వస్తే చిమ్మటి చీకట్లో మగ్గాల్సి వస్తుందన్నారు. అటువంటి తెలంగాణ లో విద్యుత్ వినిమయంలో మొదటిస్థానంలో ఉన్నాం . తెలంగాణ వస్తే చీకట్లు అన్న వారే చీకట్లో ముగ్గుతున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్నీ చర్యలను తీసుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు లేవు. కరెంట్ సమస్యలు లేకుండా సీఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు లో ఓల్టేజీ, ఇతర సమస్యలు ఎక్కువగా ఉండేవని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అలాంటి సమస్యలు లేకుండా ఎక్కడికక్కడ సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని తద్వారా ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ ను సరఫరా చేస్తున్నాం అని ఆయన తెలిపారు.