జైలు నుండి విడుదలయ్యే నేరస్తులు, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల కదలికలపై నిఘాను మరింత పెంచాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. పిడిఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా గుట్కా, గంజాయి, పేకాట లాంటి అంశాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ అన్నారు.
ఆన్లైన్ ద్వారా తమ కాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్ల దినసరి కార్యకలాపాలపై సైతం నిఘా ఉంచాలని ఆదేశించారు.
జిల్లాలో ఎక్కడైనా పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడినట్లుగా తన దృష్టికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్ల వారీగా నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిఎస్పీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలలో పర్యవేక్షణ చేస్తూ పటిష్టమైన పోలీసింగ్ అమలయ్యేలా చూడాలని చెప్పారు.
పిడిఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా గుట్కా, గంజాయి, పేకాట లాంటి అంశాలపై పర్యవేక్షణ చేస్తూ అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ పోలీస్ అధికారులకు సూచించారు.
వీటన్నింటితో పాటుగా ప్రతి పోలీస్ అధికారి విధిగా నాణ్యతతో కూడిన నేర విచారణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ డిజిపి ఆదేశాలకు అనుగుణంగా నేర విచారణల్లో ముందుకు సాగాలని ఆయన అధికారులకు సూచించారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ విధి నిర్వహణ చేయాలన్నారు. కరోనా సోకిన వ్యక్తి పట్ల వివక్ష చూపకుండా మానసిక ధైర్యం నింపే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు.
కరోనాకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియపరిచేలా ప్రజలలో చైతన్యం తేవాలని ఎస్పీ అధికారులకు తెలిపారు.