కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు. అతి శీఘ్ర దర్శనం టికెట్లు రూ.500, శీఘ్ర దర్శనం రూ.200, ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు. లక్షలాదిగా తరలిరానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఆలయం, వీధులన్నీ విద్యుద్దీపకాంతుల శోభతో అలరారుతున్నాయి. భూలోక కైలాసంగా పేరొందిన శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం, ప్రాంగణాలన్నీంటినీ విద్యుత్తు దీపకాంతులతో ముస్తాబు చేయడంతో వర్ణశోభితంగా మారింది. ఆలయం వెలుపల ప్రధాన పురవీధుల్లో దుర్గామాత, శివలింగం, నటరాజరూపం, శ్రీభ్రామరీ సమేత మల్లన్న రూపాలు, నంది మండపానికి విద్యుత్తు దీపాలంకరణను భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు రూ.40 లక్షలు వెచ్చించారు. భక్తులకు దర్శనం, వసతి, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మార్చి 1న మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం, నందివాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. 2వ తేదీన రథోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు.
previous post