మహేంద్రసింగ్ ధోనీ.. కెప్టెన్గా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన ఇతని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం ఆటతోనే కాకుండా తోటి క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో అతను వ్యవహరించే తీరుతో కోట్లాది మంది అభిమానుల మనసులు గెల్చుకున్నాడీ జార్ఖండ్ డైనమైట్.
తాజాగా పాకిస్తాన్ స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్కు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు. తన సంతకంతో కూడిన జెర్సీని రవూఫ్కు పంపి అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు ధోని. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తోన్న పాక్ యంగ్ క్రికెటర్కు ఓ దిగ్గజ ఆటగాడు జెర్సీ పంపించాడంటే మామూలు విషయమేమీ కాదు. అందుకే తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
క్రికెట్ దిగ్గజం.. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన షర్టు ఇది. తన మంచి మనసుతో నెంబర్ ‘7’ ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు’ అంటూ ధోనిపై తన అభిమానం చాటుకున్నాడు రవూఫ్. కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ధోని 2021లో చెన్నైను ఛాంపియన్గా నిలిపిన సంగతి తెలిసిందే.
ఇక దుబయిలో నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2021 సందర్భంగా టీమిండియాకు మెంటార్గా వ్యవహరించాడు ధోని. ఆ టోర్నీలో భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత దాయాది జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.