తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవితో కలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్నానగర్ పెద్దమ్మతల్లి ఆలయంలో జరిగిన శ్రావణ మాస బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు పొంగులేటికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ ప్రజలందరినీ సల్లంగా చూడాలని వేడుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కారించారు. అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని వార్డు 2 (రసూల్ పుర)కు చెందిన బీజేపీ పార్టీ మాజీ వార్డు సభ్యుడు శ్యాంసన్ రాజును, ఆ పార్టీ నాయకులు స్వరూప మలిక్, తోకల బాలరాజు ను కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పి పొంగులేటి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మాయమాటలు చెప్పి రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిందని… రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు, దీవెనలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమతిగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ రెడ్డి, సంజీవరావు, మురళీ, జెర్రిపోతులు సాయి, మారుతి గౌడ్, ఆస్గార్ తదితరులు పాల్గొన్నారు.