ప్రపంచ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి కారల్ మార్క్స్ అని ఆయన చూపిన మార్గమే అనుసరణీయమని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపగలిగేది మార్క్సిజం మాత్రమే అన్నారు.
మార్క్స్ 205వ జయంతి సందర్భంగా ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో మార్క్సిజం సమాజంపై ప్రభావం అనే అంశంపై స్థానిక సిపిఐ కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు. సెమినార్కు ముందు మార్క్స్ 205వ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఈ సెమినార్క ముఖ్య అతిథిగా హాజరైన హేమంతరావు మాట్లాడుతూ కారల్ మార్క్స్ శాస్త్రవేత్తగా, తత్వవేత్తగా సమకాలీన పెట్టుబడిదారి సమాజ పోకడలను విశీదకరించాడన్నారు. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా పెట్టుబడిదారి దేశాలు సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారి పరిష్కారం కోసం మార్క్స్ రచించిన దాస్ క్యాపిటల్స్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నాయన్నారు. మార్క్సిజం మాత్రమే అసమానతలు లేని సమాజాన్ని సృష్టించ గలుగుతుందన్నారు.
మార్క్సిజం ప్రభావమే సమాజంలో పలు మార్పులకు కారణమైందని నూతన సమాజ ఆవిష్కరణకు దారి చూపిందని హేమంతరావు తెలిపారు. అవినీతి నిర్మూలన, దోపిడీ అంతం మార్క్సిజంతోనే సాధ్యమవుతుందన్నారు. పెట్టుబడిదారి సమాజంలో అవినీతి ప్రజాప్రతినిధులు కార్యనిర్వహక వర్గానికి చేరుకున్న అనంతరం ప్రజా చైతన్యంతో చివరకు అంతమవుతుందని మార్క్స్ తెలిపారని హేమంతరావు తెలిపారు.
ప్రస్తుత భారతదేశంలో అవినీతి, కులం, దోపిడీశక్తుల ప్రభావం పెరిగిపోయిందని ఈ దోపిడీ సమాజం పతనం కాక తప్పదన్నారు. మార్క్స్ చెప్పినట్లు ప్రజా చైతన్యంతోనే మార్పు జరుగుతుందని ప్రజాచైతన్యం దిశగా కృషి జరగాలని హేమంతరావు కోరారు. 21వ శతాబ్దపు మహోన్నత వ్యక్తిగా మార్క్స్ నిలిచాడంటే ఆయన ప్రతిపాదిత సిద్ధాంతం సమాజంపై ఎంతగా ప్రభావం చూపిందో అవగతమవుతుందన్నారు.
శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన సెమినార్లో జమ్ముల జితేందర్ రెడ్డి, తాటి వెంకటేశ్వరరావు, సిహెచ్ సీతామహాలక్ష్మీ, తోట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.