శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విష ప్రయోగానికి 40 కోతులు ప్రాణం కోల్పోయాయి. కవిటి మండలం పరిధిలోని శిలగం గ్రామంలో చెట్ల పొదల్లో కోతులు చనిపోయి ఉండడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే మరికొన్ని కోతులు అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వాటికి ఆహారం అందించినప్పటికీ తినలేని స్థితిలో ఉన్నాయి.
అటవీ అధికారులు అక్కడికి చేరుకుని వాటిని పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. జంతు సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టమ్ పూర్తయిందని ఐదు రోజుల్లో నివేదిక వస్తుందని కాసీబుగ్గ అటవీ అధికారి మురళీ కృష్ణ తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ‘‘జిల్లాలో ఈ తరహా ఘటనను ఎప్పుడూ చూడలేదు. ఎవరో కానీ ట్రాక్టర్ లో కోతులను తీసుకొచ్చి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. సుమారు 40-45 కోతులు మరణించాయి’’అని మురళీ కృష్ణ తెలిపారు.