మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్ పి పి.రోహిణి ప్రియదర్శిని జిల్లా షీ టీమ్ సభ్యులతో కలసి జిల్లా షీ టీం పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ యువత చక్కగా చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు.
పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు. అమ్మాయిలను, సమాజంలోని ప్రతిఒక్కరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఒకరికొకరు గౌరవించుకోవటం, సహకరించుకోవటం వలన ఎంతో ఆనందపూరిత వాతావరణం ఏర్పడుతుందని వివరించారు.
మహిళలను ఇబ్బందులకు గురి చేసేవారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉన్నత లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని జీవితాలను మలచుకోవాలని తాత్కాలిక ఆనందాలు భవిష్యత్తును నాశనం చేస్తాయని పేర్కొన్నారు. కుటుంబ పెద్దలు తమ పిల్లల నడవడిక పై కళాశాలలో వారి చదువు గురించి దృష్టి పెట్టటం ఎంతో అవసరమని తెలిపారు.
ఎవరైనా ఆకతాయిలు,పోకిరిలు మహిళలను కానీ బాలికలను కానీ వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా జిల్లా షీటీమ్ వాట్సప్ నెంబర్ 6303923823, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 08452-223533 లకు ఫోన్ చేసినా (షీ టీమ్ మెదక్ జిల్లా ఫేస్ బుక్, మెయిల్ sheteammedakdistrict@gmail.com),(ట్విట్టర్, @Msheteam) ఫిర్యాదు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫిర్యాదు అందిన వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుంటామని, ఫోన్ చేసిన వారి నెంబరు పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. విద్యార్థినిలకు మరియు మహిళలకు విద్య చాలా ముఖ్యమైనదని ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని ప్రతి ఒక్కరి రక్షణ గురించి షీటీమ్స్ పని చేయడం జరుగుతుందని ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాట్సప్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని కోరారు.
జిల్లాలో ప్రత్యేకంగా షీటీమ్స్ ఉన్నాయని మీకు తెలియకుండా పోలీసులు సివిల్ డ్రస్ లలో ముఖ్య కూడలిల్లో తిరుగుతుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డి.ఎస్.పి. యాదగిరి రెడ్డి, మెదక్ డి.ఎస్.పి సైదులు, ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీనివాస్, జిల్లా షీ టీం సబ్యులు పాల్గొన్నారు.