బాధ్యత గల పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు లూజ్ టాక్ చేయరాదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కామెంట్ చేశారు. చంద్రబాబునాయుడి ప్రభుత్వం కన్నా ప్రస్తుతం తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తున్నదని ఆయన అన్నారు. ‘‘ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్న మా ప్రభుత్వం చెత్త ప్రభుత్వమా?’’ అని ధర్మాన ప్రశ్నించారు.
గతంలో జన్మ భూమి కమిటీల ఆధ్వర్యంలో ఎంత అవినీతి జరిగింది అనేది అందరికి తెలుసునని ఆయన అన్నారు. ప్రతి ఇంటిలో విద్యుత్ వినియోగం పెరిగిందని, దాంతోనే విద్యుత్ ఇబ్బంది వచ్చిందని మంత్రి తెలిపారు. అదే విధంగా వంట నూనెల ధరలు పెరిగాయని అయితే ఆంధ్రప్రదేశ్ కన్నా ఒడిశాలో, బిజెపి పాలిత ప్రాంతాల్లో మరింత ఎక్కువ ధరలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఏదో చిలువలు పలువలు గా విమర్శలు చేయడం తగదని మంత్రి ధర్మాన చంద్రబాబునాయుడికి హితవు చెప్పారు.