టిఆర్ ఎస్ ఐక్యతను ఇక ముందు కూడా కొనసాగించాలని, దేశంలో మతతత్వ,అభివృద్ధి నిరోదక శక్తులను నిలువరించేందుకు ప్రగతిశీల శక్తులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. ఇదే పద్ధతిలోనే ప్రయాణం చేస్తామని చెప్పారు. సిపిఐ,సిపిఐ(ఎం) మద్దతుతో మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ ఎస్ విజయం సాధించిన నేపథ్యంతో మంత్రి జగదీశ్ రెడ్డి, మునుగోడు ఎంఎల్ ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గతూర్తి ఎంఎల్ ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ హైదరాబాద్ మగ్ధుంభవన్ సిపిఐ నేతలను గళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి,జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి,ఈ.టి.నర్సింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రికి సిపిఐ నేతలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా అంతకుముందు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మగ్ధుంభవన్ సిపిఐ నేతలను మార్యదపూర్వకంగా కలిసి కృతజ్ఞత తెలియజేశారు.
రాష్ట్రంలో అలజడి సృష్టించే యత్నం: మంత్రి జగదీశ్ రెడ్డి
రాష్ట్రంలో సజావుగా సాగుతున్న పరిపాలనకు ఆటంకాలను సృష్టించి, అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, బిజెపి రెండూ కలిసి కుట్రతో ఉప ఎన్నికను సృష్టించి, రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించే యత్నం చేశాయని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి విమర్శించారు.మగ్ధుం భవన్ వద్ద మంత్రి జగదీశ్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బిజెపిని అడ్డుకునే పార్టీ టిఆర్ ఎస్ కెసిఆర్ అని విశ్వసించి సిపిఐ తమకు మద్దతునిచ్చిందన్నారు.
మునుగోడులో సొంత అభ్యర్థి పోటీ చేస్తే ఎలా పని చేస్తారో అదే తరహాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నుండి గ్రామ కార్యదర్శి వరకు అందరూ పూర్తి స్థాయిలో నిమగ్నమై పని చేశారని, కమ్యూనిస్టుల మద్దతుతోనే టిఆర్ ఎస్ గెలిచిందని, తద్వారా ప్రజలలో కూడా విశ్వాసం నెలకొన్నదని మంత్రి అన్నారు. వామపక్షాల మద్దతు నేపథ్యంలో బిజెపిని నిలువరించేందుకు కెసిఆర్ మరింత బలోపేతం చేయాలని ప్రజలు టిఆర్ ఎస్ గెలిపించారన్నారు. బిజెపి ఎన్ని రకాల కుట్రలు, అక్రమాలు చేసినా అన్నింటిని ఎదుర్కొని ప్రజలు ఏకపక్షంగా టిఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపపించారని తెలిపారు. తమ విజయానికి కృషి చేసిన కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జిని యాదగిరి రావుతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకుల, కార్యకర్తలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.అనంతరం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటానని, నియోజకవర్గ అభివృద్ధి లక్షంగా పనిచేస్తానని హామీనిచ్చారు.