తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలన శాఖ మంత్రి, టీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘనంగా నిర్వహించారు. నకిరేకల్ నియోజకవర్గంలోని బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ వద్ద మంత్రి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో 24 గంటలు శ్రమిస్తున్న యువ నాయకుడు కేటీఆర్ అని అన్నారు. బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ను పూర్తి చేసి లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని గతంలో కేటీఆర్ హామీ ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.
కేటీఆర్ సహకారంతోనే బ్రాహ్మణ వెల్లంలో ఉదయసముద్రం ప్రాజెక్టుతో పాటు ధర్మారెడ్డి పిల్లాయిపల్లి ఎర్రకాలువ పూర్తవుతాయని ఆయన తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు.